రాబోయేది జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమే – పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం 4 వ విడత వారాహి యాత్ర మొదలుపెట్టారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ లో ఈ యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా అవనిగడ్డ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. టీడీపీ తో పొత్తు ప్రకటించిన తర్వాత మొదటిసారి ప్రజల్లోకి వచ్చారు పవన్. అలాగే ఈ యాత్రకు టీడీపీ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పెద్ద ఎత్తున టీడిపి శ్రేణులు కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులకు కూడా ధన్యవాదాలు తెలిపారు పవన్.

ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, నిన్న ఈ ముఖ్యమంత్రి కురుక్షేత్రం ప్రారంభమైందని అన్నాడని, కానీ కౌరవులు వాళ్లేనని, ఓడిపోయేది కూడా వాళ్లేనని పవన్ పేర్కొన్నారు. 100 మంది పైగా ఉన్న వైస్సార్సీపీ వాళ్లే కౌరవులని, కాబట్టి వాళ్లు ఓడిపోవడం, తాము అధికారంలోకి రావడం ఖాయం, డబుల్ ఖాయం అని వ్యాఖ్యానించారు. అవనిగడ్డ అంటే డీఎస్సీ శిక్షణకు ఆయువుపట్టు వంటిదని, ఏపీలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అభ్యర్థులు వేలకు వేలు ఖర్చుపెట్టి సన్నద్ధమైనా, ఇంతవరకు డీఎస్సీ జాడేలేదని మండిపడ్డారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోలేదని, ఎవరికీ న్యాయం చేయలేదని పవన్ ఆరోపించారు.

ఏపీ భవిష్యత్తు దృష్ట్యా ఈసారి ఓటు చీలనివ్వకూడదు… వైస్సార్సీపీని దించేయడమే మా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అని పవన్ ధీమా వ్యక్తం చేసారు. జగన్ వేల కోట్లు దోచేసిన తర్వాత కూడా ఇంకా దోచుకుంటూనే ఉన్నాడు. మీ వద్ద డబ్బులు ఉండకూడదని మీకు ఉద్యోగాలు ఇవ్వడు… నా దగ్గర డబ్బులు ఉండకూడదని నా సినిమాల టికెట్లు 5 రూపాయలు చేస్తాడు… అందరూ తన వద్ద దేహీ అనాలన్నది జగన్ ఆలోచన.

జగన్ వంటి అధికార మదంతో ఉన్న వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. కానీ నా వద్ద ఓట్లు కొనడానికి డబ్బులు లేవు. దయచేసి రూ.500కి, రూ.2 వేలకు ఓట్లు వేయకండి… ఈ ఒక్కసారి ఆలోచించండి. వేల కోట్లు ఉన్న వ్యక్తితో, ప్రైవేటు సైన్యం కలిగిన వ్యక్తితో, అనుభవజ్ఞులైన నేతలను కూడా జైలుకు పంపిన వ్యక్తితో నేను తలపడుతున్నాను… దీన్నిబట్టే అర్థం చేసుకోండి మీ కోసం నేను ఎంత బలంగా నిలబడుతున్నానో అని అన్నారు.