నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కెటిఆర్‌ పర్యటన

ktr

హైదరాబాద్ : మంత్రి కెటిఆర్‌ ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట , నల్లగొండ జిల్లా కేంద్రాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. సోమవారం ఉదయం 11 గంటలకు మంత్రి కెటిఆర్‌ హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు చేరుకుంటారు. 11.15గంటలకు పాత కలెక్టరేట్‌ భవనంలో ఐటీ హబ్‌ను ప్రారంభిస్తారు. 11.45గంటలకు రూ.118కోట్లతో నిర్మించిన ఎస్టీపీ ప్లాంట్‌ను, పట్టణ ప్రగతిలో భాగంగా రూ.4కోట్ల వ్యయంతో నిర్మించిన మునిసిపల్‌ కాంప్లెక్స్‌ భవనాలను, మహిళా కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తారు. అక్కడే ఎఫ్‌ఎస్టీపీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు.

అనంతరం రూ.316కోట్లతో చేపట్టనున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు, వాటర్‌ పైపులైన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ధోబీఘాట్‌ నిర్మాణానికి, సీసీ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12గంటలకు కొత్తబస్టాండ్‌ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ర్యాలీగా వెళ్తారు. పట్టణానికి చెందిన 804 మంది లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా నల్లగొండకు చేరుకుంటారు.