త్వరలో 15వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్
నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రశ్నాపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 60 పోస్టులను చేర్చి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. అలాగే 15 రోజుల్లో 15వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని.. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రూప్-1 ఉద్యోగాలకు అదనంగా రెండేళ్ల వయోపరిమితి అమలు చేయబోతున్నామని తెలిపారు. హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం (జనవరి 7న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణిలో 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా 412 మందికి కారుణ్య నియామక పత్రాలు, 29 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలను సీఎం అందజేశారు. వీరిలో బదిలీ వర్కర్లు, జూనియర్ అసిస్టెంట్లు, మోటారు మెకానిక్లు ఉన్నారు. ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.