మంగళగిరి కోర్టుకు వెళ్లిన నారా లోకేశ్
తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ కేసు
అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి కోర్టుకు వెళ్లారు. వైఎస్ఆర్సిపి నేతలపై వేసిన పరువు నష్టం దావా విషయంలో ఆయన అదనపు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. వైఎస్ఆర్సిపి నేతలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిలు తనపై అసత్య ప్రచారం చేశారని లోకేశ్ కోర్టును ఆశ్రయించారు. ఉమామహేశ్వరి మరణం, హెరిటేజ్ సంస్థపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు వైఎస్ఆర్సిపి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పరువు నష్టం దావాలో లోకేశ్ పేర్కొన్నారు.
కాగా, తన పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో చనిపోయినప్పుడు… వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారం చేశారని… తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణిలపై పోతుల సునీత దారుణ వ్యాఖ్యలు చేశారని లోకేశ్ కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఈరోజు మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చారు. మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని ఇస్తున్నారు.