నేడు ఢిల్లీ మేయర్ ఎన్నిక

Delhi CM Kejriwal

న్యూఢిల్లీః మూడు సార్లు వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మేయర్ ఎన్నిక అనంతరం డిప్యూటీ మేయర్‌తోపాటు ఆరుగురు స్టాండింగ్‌ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. సుప్రీంకోర్టులో ఆప్ నిర్ణయాత్మక విజయం తర్వాత ఢిల్లీ మేయర్‌ ఎన్నిక నిర్వహించడానికి మార్గం సుగమమయింది. కాగా మోజారిటీ ప్రకారం మేయర్ సీటును ఆప్ దక్కించుకోనుంది.

ఢిల్లీ మేయర్ ఎన్నికలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన 10 మంది కౌన్సిలర్లకు మేయర్ ఎన్నికలో ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ అనుమతించారు. ఈ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. నామినేటెడ్ సభ్యులంతా బిజెపికి ఓటేస్తారని వాదించింది. డీఎంసీ యాక్ట్ 1957 ప్రకారం నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే అధికారం లేదని చెప్పింది. ఈ క్రమంలో మూడుసార్లు ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఆమ్ ఆద్మీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆప్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయవద్దని చెప్పింది.

ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక సమావేశం నిర్వహించగా నామినేటెడ్ సభ్యుల ఓటు హక్కు విషయంలో బిజెపి, ఆప్ ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో ఆప్ సుప్రీంకోర్డును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తక్షణమే ఎన్నిక జరపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మేయర్ ఎన్నిక జరగనుంది.