కీలక మైలురాయిని చేరుకున్న కియా కార్ల కంపెనీ.. చంద్రబాబు అభినందనలు

ఏపీలో కియా పెట్టుబడులు బలమైన సంకల్పమని వెల్లడి

chandra-babu-congratulates-kia-management-for-one-million-units-production

అమరావతిః టిడిపి ప్రభుత్వ హయాంలో అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా కార్ల ఫ్యాక్టరీ 1 మిలియన్ కార్లను తయారు చేసి కీలక మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా కియా యాజమాన్యానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. 2017లో కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు రావడం ఓ బలమైన సంకల్పమని ఆయన పేర్కొన్నారు. రాయలసీమలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచిందని మెచ్చుకున్నారు. ఈ ఫ్యాక్టరీతో సీమలో వలసలు తగ్గాయని, స్థానికంగానే ఉపాధి పొందుతున్నారని వివరించారు.

అనంతపురం ప్రాంత రూపు రేఖలను మార్చి, సంపద సృష్టి, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రపంచ వేదికపై ప్రత్యేకతను చాటుకున్న కియా కంపెనీ.. అనంతపురం ఫ్యాక్టరీలో పది లక్షల కార్లను ఉత్పత్తి చేయడం సంతోషకరమని చెప్పారు. ఈ మైలురాయిని అందుకున్నందుకు యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. సీమ ప్రాంతానికి చెందిన యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించిందంటూ కియా కంపెనీని చంద్రబాబు మెచ్చుకున్నారు.