వాల్తేర్ వీరయ్య – వీరసింహరెడ్డి లకు అల్ ది బెస్ట్ తెలిపిన నారా లోకేష్

సంక్రాంతి బరిలో వస్తున్న నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి లకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా అల్ ది బెస్ట్ తెలిపారు. చిరంజీవి- బాబీ కలయికలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య మూవీ జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా , బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహ రెడ్డి చిత్రం రేపు జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం విశేషం. భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాల ఫై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ఇక ఈ రెండు సినిమాలు పెద్ద సక్సెస్ కావాలని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా కోరుకుంటున్నారు. ముందుగా నారా లోకేష్ ఈ రెండు సినిమాలు పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ లోకేష్ ఆరోపణలు చేశారు. సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వ‌స్తున్న బాల మావ‌య్య‌, వాల్తేరు వీర‌య్య‌గా వ‌స్తున్న‌ చిరంజీవి శుభాకాంక్ష‌లు అని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. అల‌రించే పాట‌లు, ఆలోచింప‌జేసే మాట‌లు, ఉర్రూత‌లూగించే డ్యాన్సుల‌తో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాల‌ను కోట్లాది ప్రేక్ష‌కుల‌లో ఒక‌డిగా నేనూ చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నానని ఆయన అన్నారు.

హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు అధికార పార్టీ స‌న్న‌ద్ధ‌మైందని, ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమాలు విడుద‌లవుతున్న సంద‌ర్భాన్ని వాడుకుని సోష‌ల్మీడియాలో ఫేక్‌ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మ‌రో కులంపై విషం చిమ్మాల‌ని కుట్ర‌లు ప‌న్నారని ఆయన మండిపడ్డారు. విష‌ప్ర‌చారాలు చేసి కుల‌,మ‌త‌,ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు ర‌గిల్చిన దుష్ట చ‌రిత్ర గ‌లిగినవారి ట్రాప్‌లో ఎవ‌రూ ప‌డొద్దని, సినిమాలు అంటే వినోదమన్న నారా లోకేష్‌.. సినిమాల‌ను వివాదాల‌కు వాడుకోవాల‌నే అధికార పార్టీ కుతంత్రాల‌ను తిప్పికొడ‌దామన్నారు. మ‌న‌మంతా ఒక్క‌టే అని, కులం, మ‌తం, ప్రాంతం ఏవీ మ‌న‌ల్ని విడ‌దీయ‌లేవని ఆయన పేర్కొన్నారు.