మోడీ, అమిత్ షాల పై మరోసారి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
ఎట్టకేలకు మోడీ జీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలోనే నం.1గా నిలిచింది
హిందీ భాష మాట్లాడాలని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల పై మండిపడ్డారు. దేశంలో పెరిగిపోతోన్న పెట్రోలు, డీజిల్ ధరల గురించి వచ్చిన పలు కథనాలను ఆయన ప్రస్తావించారు. ”ఎట్టకేలకు ప్రధాని మోడీజీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరింది. కొనుగోలు శక్తి తుల్యత (పీపీపీ) గణాంకాల ద్వారా వేసిన అంచనాల ప్రకారం… దేశంలో ఎల్పీజీ గ్యాసు సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ప్రపంచంలో పెట్రోలు ధరలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచంలో డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఎనిమిదవ స్థానంలో ఉంది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాగా, దేశంలో ఇంగ్లిష్కు ప్రత్యామ్నాయం హిందీ భాష మాత్రమేనని తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ”భిన్నత్వంలో ఏకత్వమే మన బలం డియర్ అమిత్ షా జీ.. భారత్ అంటే రాష్ట్రాల సమాఖ్య (యూనియన్ ఆఫ్ స్టేట్స్), నిజమైన వసుధైక కుటుంబం. ఇంత గొప్పదైన మన దేశంలో తాము ఏం తినాలో, ఏ దుస్తులు ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాష మాట్లాడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు? భాషపర ఆధిపత్యం వల్ల దేశం తిరోగమనం చెందే ప్రమాదం ఉంది.
నేను మొదట భారతీయుడిని, తర్వాతే తెలుగువాడిని, తెలంగాణ పౌరుడిని. నేను నా మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, కొద్దిగా ఉర్దూలోనూ మాట్లాడగలుగుతాను. అయితే, మీరు హిందీని మాత్రమే మాట్లాడాలని అంటూ ఇంగ్లిష్ భాషను ఇలాగే అగౌరవపర్చితే దాని పరిణామాల వల్ల భవిష్యత్తులో… ప్రపంచంలో రాణించాలనుకుంటున్న మన దేశ యువతకు నష్టం కలుగుతుంది” అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/