పాత కేసును తీసుకొచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణం: నందమూరి రామకృష్ణ

చంద్రబాబును మళ్లీ సీఎం చేద్దామని రాష్ట్ర ప్రజలకు పిలుపు

nandamuri-ramakrishna-respond-about-chandrababu-arrest

విజయవాడః టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై నందమూరి రామకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో ఇప్పుడున్న వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఎప్పుడో 2021లో ఉన్న కేసును తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా అన్యాయమని చెప్పారు. విభజన తర్వాత ఏర్పడిన ఏపీని ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అన్ని విధాలుగా మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. చంద్రబాబు హయాంలో తొలి స్థానంలో ఉన్న ఏపీని, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అడుక్కునే స్థాయికి దిగజార్చిందని విమర్శించారు.

రాష్ట్రాన్ని వదిలేసి ముఖ్యమంత్రి జగన్ విదేశాలు తిరుగుతున్నారని రామకృష్ణ విమర్శించారు. ఇలాంటి సీఎం ఉండటం మన దౌర్భాగ్యమని అన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని, ఏపీని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లి మళ్లీ తొలి స్థానంలో నిలుపుదామని చెప్పారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నానని అన్నారు. తన ప్రసంగం సందర్భంగా భావోద్వేగానికి గురైన రామకృష్ణ కంటతడి పెట్టుకున్నారు.