పాలనా వికేంద్రీకరణకే మా ఓటు : మంత్రి బొత్స
మా పార్టీ అధినేత ఆలోచనే మాకు శిరోధార్యం
టీడీపీ నేతల మాటలను పట్టించుకోబోం
అమరావతి: అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో మరోమారు ఏపీ రాజధాని అంశంపై పెద్ద ఎత్తున చర్చకు తెర లేచింది. కనీసం కోర్టు తీర్పుతో అయినా వైస్సార్సీపీ ప్రభుత్వం కళ్లు తెరవాలని విపక్ష టీడీపీ వాదిస్తోంటే.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని, ఇప్పటికీ తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని అధికార వైస్సార్సీపీ చెబుతోంది. ఈ క్రమంలో జగన్ కేబినెట్లోని కీలక మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం నాడు తమ ప్రభుత్వ వైఖరిని మరోమారు సుస్పష్టంగా చెప్పేశారు.
ఇప్పటికీ తమ ప్రభుత్వం మూడు రాజదానులకే కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా వికేంద్రీకరణను ప్రస్తావించిందని మంత్రి చెప్పారు. నాడు అధికారంలో ఉన్న టీడీపీ శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను ఎందుకు పట్టించుకోలేదని కూడా ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత ఆలోచనలే తమకు శిరోధార్యం అని చెప్పిన మంత్రి.. టీడీపీ నేతలు చెప్పిన మాటలను తాము పెద్దగా పట్టించుకోబోమన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/