కన్నా లక్ష్మీనారాయణను కలిసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

MP Lavu Sri Krishna Devarayalu meet Kanna Lakshminarayana

అమరావతిః ఏపీలో వైఎస్‌ఆర్‌సిపి అసంతృప్త నేతలు టిడిపి లేదా జనసేన వైపు చూస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పలువురు వైఎస్‌ఆర్‌సి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టికెట్ నిరాకరించడం లేదా నియోజకవర్గ మార్పు చేస్తున్నారు. ఈ క్రమంలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు స్థానం కూడా గల్లంతైంది.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీ స్థానం ఇన్చార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. శ్రీకృష్ణదేవరాయలు టిడిపిలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎంపీతో పాటు వైఎస్‌ఆర్‌సి రెబెల్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎన్నారై వైద్య నిపుణుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో గుంటూరు రాజకీయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబును కూడా కలిశారు.