మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా మోహన్​ యాదవ్​ ప్రమాణ స్వీకారం

Mohan Yadav sworn in as chief minister of Madhya Pradesh

భోపాల్‌ః మధ్యప్రదేశ్‌లో నూతనంగా బిజెపి సర్కార్ కొలువు దీరింది. భోపాల్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఈరోజు మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ మంగూబాయ్‌ పటేల్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీశ్‌ దేవ్డా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోపాటు మరికొందరు కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే తదితరులు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారానికి ముందు మోహన్ యాదవ్ భోపాల్​లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పండిత్​ దీన్​దయాళ్​ ఉపాధ్యాయ్​, శ్యామా ప్రసాద్​ ముఖర్జీ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. గతనెల 17వ తేదీన 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బిజెపి 163 సీట్లల్లో గెలిచి మరోసారి అధికారం నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా బిజెపి ఎవరిని ఎన్నుకుంటుందో అని ఇన్నాళ్లుగా సాగిన ఉత్కంఠకు తాజాగా తెర దించింది హైకమాండ్. మోహన్ యాదవ్​ పేరును ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకుంది.