2040 నాటికి చంద్రుడి పైకి భారతీయుడు : ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌

First Indian astronaut on moon by 2040, says Isro Chairman Somanath

తిరువనంతపురంః చంద్రయాన్‌-3 ద్వారా జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్ ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఈ క్రమంలోనే భవిష్యత్ ప్రణాళికలు రచిస్తూ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇందులో మొదటగా 2040 నాటికి చంద్రుడిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దించుతామని సంస్థ ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామని వెల్లడించారు. వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్‌ పైలట్లని చెప్పారు.

గగన్‌యాన్‌ ప్రాజెక్టు ద్వారా రోదసి అన్వేషణలో తదుపరి అంకాన్ని ఇస్రో చేపట్టనున్నట్లు సోమనాథ్ వెల్లడించారు . దీనికింద ఇద్దరు లేదా ముగ్గురు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపుతామని తెలిపారు. వారు మూడు రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారని వివరించారు. వీరంతా ప్రస్తుతం బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని చెప్పారు. 2035 నాటికి భారత స్పేస్ స్టేషన్ లక్ష్యాన్ని నెరవేర్చాలని ప్రధాని మోడీ నిర్దేశించినట్లు తెలిపారు.