నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
యూపీలోని వారణాసి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, పార్టీ సినియర్ నేతలు, బీజేపీ పాలిత, మిత్రపక్షాల ముఖ్యమంత్రులతోపాటు ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలు హాజరయ్యారు. దీంతో ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి చూసుకున్నారు.
వారణాసిలో మోడీ నామినేషన్ సందర్బంగా.. సోమవారం ఆరు కిలోమీటర్ల మేర ఆ పట్టణంలో భారీ రోడ్షో నిర్వహించారు. విద్యా రంగ సంస్కర్త మదన్మోహన్ మాలవీయా విగ్రహానికి పూలమాల సమర్పించి తన యాత్రను ఆయన ప్రారంభించారు. రోడ్షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ, కనీసం వంద చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు అటు ఇటు పెద్దఎత్తున గుమిగూడి రోడ్షోకు స్వాగతం పలికారు. నరేంద్రమోదీపై పూలవర్షం కురిపించారు.