తిరుమలకు చేరుకున్న నారా లోకేష్
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఈ నెల 27 నుండి యువగళం పేరుతో పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని తన ఇంట్లో కుటుంబంతో కలిసి పూజలు నిర్వహించారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్న లోకేశ్, అత్తామామలు, బంధువులందరి ఆత్మీయ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ఘాట్కి చేరుకుని, నందమూరి తారకరామారావుకి నివాళులు అర్పించారు. అక్కడి నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకుని కడప వెళ్లారు. కడపలో నారా లోకేశ్ కి టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కడప వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కడప పెద్ద దర్గాని సందర్శించి, మత పెద్దలను అడిగి దర్గా విశిష్టతను తెలుసుకున్నారు. అక్కడి నుండి మరియాపురం చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. ఈ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. కాగా లోకేష్ పాదయాత్ర కోసం ప్రత్యేక కర్వాన్ వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతి, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్లో అధునాతన ఏర్పాట్లు చేశారు. కుప్పం నుంచి శుక్రవారం లోకేష్ పాదయాత్ర ఆరంభమై, 4 వేల కిలోమీటర్లు, 400 రోజులపాటు సాగనుంది.