తిరుమలలో బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది

గురువారం రాత్రి తిరుమల అలిపిరి మార్గంలో ఏడో మైలు దగ్గర బాలుడిపై దాడి చేసిన చిరుత ను అధికారులు బంధించారు. అధికారులు ఏర్పాటు చేసిన బోనులో శుక్రవారం రాత్రి 10.45 గంటలకు చిరుత చిక్కింది. ఒక్కరోజులోనే చిరుతను బంధించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతకు ఏడాదిన్నర వయసు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే వేటాడే లక్షణాలు అలవాటు అవుతున్నాయని.. అందుకే బాలుడిని లాక్కెళ్లిన సమయంలో వదిలేసినట్లు తెలిపారు.

గురువారం రాత్రి అలిపిరి నడకదారి మార్గంలో ఆదోనికి చెందని కుటుంబం తిరుమలకు నడిచి వెళుతోంది. ఈ క్రమంలో బాలుడు తాతతో కలిసి ఓ షాపు దగ్గర స్నాక్స్ కొనుగోలు చేస్తున్నాడు.. ఇంతలో ఏడో మైలు దగ్గర బాలుడిపై చిరుత దాడి చేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. బాలుడి తాత పెద్దగా కేకలు వేయడంతో నడక మార్గంలో తిరుమల వెళుతున్న తిరుమల టూటౌన్ ఎస్సై రమేష్ గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి ఏం జరిగిందో ఆరా తీశారు. ఎస్సై భక్తులతో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లి చూడగా 150 మీటర్ల దూరంలో బాలుడ్ని గుర్తించారు. బాలుడికి గాయాలు కాగా.. వెంటనే తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తరలించారు.. బాలుడికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.