బీజేపీకి కేటీఆర్ సవాల్

బీజేపీకి బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ముందస్తుకు రండి.. తప్పకుండా ముందస్తుకు అందరం కలిసి పోదాం. ఎవరేందో ప్రజలే తేలుస్తారు అని కేటీఆర్ సవాల్ విసిరారు. శనివారం కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఎంపీ ధర్మపురి ఫై మండిపడ్డారు. పొద్దున్నే లేస్తే కేసీఆర్ను, మంత్రులను తిట్టడం పనిగా పెట్టుకున్నారు. కానీ మేం మాట్లాడటం మొదలు పెడితే మీ అయ్యలు, మీ తాతలు గుర్తువచ్చేలా మాట్లాడే సత్తా మాకుంది. మీ కంటే బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాం. ఇకనైనా సభ్యతతో మాట్లాడాలని ఎంపీ ధర్మపురి అరవింద్కు చెప్తున్నా. ఒక పెద్ద మనిషి కొడుకువు. డీ శ్రీనివాస్ అంటే మా అందరికీ గౌరవం ఉంది. పెద్దాయన కొడుకవని ఊకుంటున్నాం. ఇంత సంస్కారహీనంగా మాట్లాడకు. మేం కూడా మాట్లాడగలం కానీ.. మేం నీలా సంస్కారహీనులం కాదు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇకపై ఊరుకోం అని కేటీఆర్ హెచ్చరించారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు అని ఒకాయన అంటడు అని కేటీఆర్ గుర్తు చేశారు. 2014కు కంటే ముందు దేశంలో 14 మంది ప్రధానమంత్రులు పని చేశారు. వీరు 67 ఏండ్లలో చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లు.. కానీ నరేంద్ర మోదీ ఈ 8 ఏండ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసిండు. లక్షల కోట్లు అప్పు చేసిన మోదీ.. ఒక్క మంచి పని కూడా చేయలేదు. పిల్లల బంగారు భవిష్యత్ కోసమే మేం అప్పులను ఉత్పాదక రంగంలో పెట్టుబడుల రూపంలో పెట్టాం. మేం మీలాగా కార్పొరేట్ దోస్తులకు పంచి పెట్టలేదు అని కేటీఆర్ అన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఉన్నాయా? మిషన్ భగీరథ, రైతు వేదికలు, ఇంటింటి ముందు నల్లా వంటి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నాయా? బెస్ట్ గ్రామపంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని మీరే అవార్డులు ఇస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో మన మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తారు. ఢిల్లీలో ఉండేవారేమో అవార్డులు ఇస్తారు.. గల్లీలో ఉండేవారేమో కారుకూతలు కూస్తారు. పనికిమాలిన మాటలు మాట్లాడుతారు.. అయితే ఢిల్లీలో ఉన్నోడికైనా బుద్ధి లేదు.. లేదంటే గల్లీలో ఉన్నోడికైనా బుద్ధి లేదు. తెలంగాణ అభివృద్ధి నమూనా భారతదేశంలో ఎక్కడైనా ఉందా? అని బిజెపి ని కేటీఆర్ నిలదీశారు.