కెటిఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
24 గంటలు సమయం ఇస్తా… ఆరోపణలు నిజమని నిరూపించగలవా?..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్ః కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిందని, అందుకు ప్రతిగా ఆయన బిజెపిలో చేరారని, ఇది క్విడ్ ప్రో కో అని తెలంగాణ మంత్రి కెటిఆర్ ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకునే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
“కల్వకుంట్ల తారకరామారావు (కెటిఆర్)కు బహిరంగ సవాల్ విసురుతున్నా. నీకు 24 గంటల సమయం ఇస్తున్నా. నాపై చేసిన క్విడ్ ప్రో కో ఆరోపణలు నిజమని నిరూపించు… లేకపోతే పరువునష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు” అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, రాజకీయ విమర్శల పర్వం ఊపందుకుంది. మునుగోడులో బిజెపి తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తుండగా, అధికార టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/