కేసిఆర్ చేతుల మీదుగా జూన్ లో అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం

జూన్ నెల‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రాష్ట్ర రోడ్లు, భవనాల‌ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు….హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.

నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనుల‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూం, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పై అంతస్థులో రెస్టారెంట్, నిరంతరం జ్వలించే జ్యోతి ఆకృతి ఇలా అన్ని రకాల పనుల‌ను మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగర నడి బొడ్డున,హుస్సేన్ సాగర్ తీరాన ఈ నిర్మాణం చేపట్టారని ఈ సందర్బంగా తెలిపారు.