పార్టీ విషయంపై జగన్‌ అన్నతో సంప్రదించలేదు..షర్మిల

ఏపీలో ఆయన పని ఆయన చూసుకుంటారు
తెలంగాణలో నా పని నేను చూసుకుంటా

హైదరాబాద్‌: వైఎస్‌ షర్మిల ఈరోజు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో అభిమానులు, కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఏ లోటస్ పాండ్ లోని కార్యాలయం వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ తో మీకు విభేదాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు.

తమ పార్టీ విషయంలో జగన్ అన్నతో తాను సంప్రదించలేదని షర్మిల తెలిపారు. ఏపీలో ఆయన పని ఆయన చూసుకుంటారని, తెలంగాణలో తన పని తాను చూసుకుంటానని చెప్పారు. తెలంగాణ వైఎస్‌ఆర్ విభాగంతో కలసి పని చేస్తానని తెలిపారు. తమ మధ్య అన్నాచెల్లెళ్ల మధ్య బంధం కొనసాగుతుందని చెప్పారు. రాజకీయంగా తన దారి తనదేనని అన్నారు. తెలంగాణ అంశాల వరకే తమ పార్టీ పరిమితమవుతుందని చెప్పారు.

మరోవైపు షర్మిల అభిమానులు మాట్లాడుతూ..పార్టీ పెట్టాలనే ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. షర్మిల ఆదేశాల మేరకు నడుచుకుంటామని అన్నారు. కాగా, ఈ రోజు నుంచి వివిధ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు.