ఎయిరిండియా విమానాల న్యూలుక్
న్యూఢిల్లీః ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్.. ఈ సంస్థలో పెనుమార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే సంస్థ లోగో, విమానాల రూపులో మార్పులు చేసింది. అయితే వీటికి సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఎయిరిండియా విమానాల న్యూలుక్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్రాన్స్లోని టౌలోసి వర్క్షాప్లో కొత్త లోగో, డిజైన్తో ఏ350 విమానాన్ని సరికొత్తగా తీర్చిదిద్దింది. ఈ శీతాకాలానికి ఏ350 విమానాలను స్వదేశానికి తీసుకురానున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది.
అపరిమిత అవకాశాలు, ప్రగతిశీలత, భవిష్యత్తుపై విమానయాన సంస్థకు ఉన్న విశ్వాసం, ధైర్యానికి సంకేతంగా ఈ కొత్త లోగోను రూపొందించినట్లు టాటా గ్రూప్ పేర్కొంది. లోగోలో ఎయిరిండియా ఫాంట్ను కూడా మార్చారు. దీనికోసం సొంతంగా ‘ఎయిర్ ఇండియా శాన్స్’ ఫాంట్ను డిజైన్ చేశారు. అలాగే ఎరుపు, ఊదారంగు, పసిడి వర్ణం డిజైన్లతో విమానాల డిజైన్ను మార్చారు.
తమ ఫ్లీట్లో ఉన్న పాత విమానాలన్నింటినీ కూడా ఈ కొత్త డిజైన్లోకి మార్చనున్నట్లు .. ఇందుకోసం 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరు నుంచి కొత్త లోగోతో కొన్ని విమాన సర్వీసులు మొదలుకానున్నాయి.