నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్న సిఎం కెసిఆర్‌

500 వాహనాలతో భారీ ర్యాలీగా కాసేపట్లో మహారాష్ట్రకు కెసిఆర్

kcr-going-to-maharashtra-with-500-cars-convoy

హైదరాబాద్‌ః మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఆయన పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రగతి భవన్ నుంచి 500 వాహనాల భారీ కాన్వాయ్ తో ఆయన మహారాష్ట్రకు బయల్దేరనున్నారు. 2 వేల మంది నేతలు కెసిఆర్ తో పాటు వెళ్లనున్నారు. వీరి ప్రయాణం 300 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలను ఆకర్షించడంపై కెసిఆర్ దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో సమన్వయం చేసుకుని చేస్తున్నారు. ఏర్పాట్లను మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొంగ్డే, బీఆర్ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర శాఖ కన్వీనర్ మాణిక్ కదమ్ పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర పర్యటన అనంతరం ఉస్మానాబాద్ (దారాశివ్) విమనాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో కెసిఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు.

మరోవైపు మహారాష్ట్రకు వెళ్లే 65వ నెంబర్ జాతీయ రహదారి పొడవునా భారీ ఎత్తున స్వాగత తోరణాలు, బిఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. కెసిఆర్ వెంటన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు మహారాష్ట్రకు వెళ్తున్నారు.