మళ్లీ తెరుచుకున్న రామేశ్వరం కేఫ్
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు వైట్ఫీల్డ్ ఏరియాలోని రామేశ్వరం కేఫ్ మళ్లీ తెరుచుకుంది. కేఫ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కేఫ్కు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. కేఫ్ గేట్ వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు.
రామేశ్వరం కేఫ్లో మార్చి 1వ తేదీన మధ్యాహ్నం బాంబు బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఇక బాంబు బ్లాస్ట్కు కారణమైన యువకుడి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. బాంబు బ్లాస్ట్ జరిగిన రోజు అతను క్యాప్, ముఖానికి మాస్కు ధరించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. నిందితుడికి సంబంధించిన పలు చిత్రాలను పోలీసులు విడుదల చేశారు.