కశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

పక్కా ప్రణాళికతో కొండపైకి చేరిన ఉగ్రవాదులు

Kashmir Encounter Enters Day 4, Gunfight Continues In Challenging Terrain

శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మొదలైన ఎన్‌కౌంటర్ వరుసగా నాలుగో రోజూ కొనసాగుతోంది. ఓ కొండపైనున్న గుహలో నక్కిన ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతున్నారు. వారు నక్కిన ప్రాంతంలో ఓవైపు దట్టమైన అడవి, మరోవైపు కొండ ఉండడంతో ఏరివేత కష్టంగా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కోకెరంగ్‌లోని గడుల్ అటవీ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, స్థానిక పోలీసులు మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ రోజు రాత్రి ఉగ్రవాదులతో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ రోజులు గుడుస్తున్నా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఓ సైనికుడు గల్లంతవగా, ముగ్గురు అధికారులు అమరులయ్యారు.

కొండపైన గుహలో ఉన్న ఉగ్రవాదులు కిందనున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. కొండను చుట్టుముట్టిన భద్రతా బలగాలు రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో బాంబులు జార విడుస్తున్నాయి. అయితే, అక్కడి పరిస్థితులు సవాలుగా మారడంతో ఉగ్రవాదులపై పట్టు సాధించడం భద్రతా దళాలకు సవాలుగా మారిందని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తిస్థాయి శిక్షణ పొందిన ఉగ్రవాదులు కావాల్సిన ఆహారం, పేలుడు సామగ్రితో పక్కా ప్రణాళిక ప్రకారం అందులో తలదాచుకున్నారు. గుహలో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.