జగన్ ను బిజెపి ఎప్పుడూ సమర్థించలేదుః సోము వీర్రాజు
ఏపీ అవినీతి మంత్రులపై బిజెపి పోరాడుతుందని వ్యాఖ్య
అమరావతిః వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి తనకు అండగా ఉండకపోవచ్చన్న జగన్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ… జగన్ ను బిజెపి ఏనాడూ సమర్థించలేదని, ఆయనకు అండగా లేదని చెప్పారు. వైఎస్ఆర్సిపితో బిజెపి ఎప్పుడుందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అనుసరిస్తున్న విధానాలను ర్యాలీలు, సభలు, ఆందోళనల ద్వారా ప్రజలకు వివరించామని తెలిపారు. మతతత్వ వైఖరితో బిజెపి లేదని… ఆ వైఖరితో వైఎస్ఆర్సిపి ఉందని అన్నారు. బిజెపి గురించి మాట్లాడే హక్కు కూడా జగన్ కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బిజెపికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయడని జగన్ ఎలా చెపుతారని వీర్రాజు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ బిజెపితోనే ఉన్నారని చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ గురించి వైఎస్ఆర్సిపి నేతలు ఎప్పుడూ మాట్లాడరని… వారి పార్టీని విమర్శించినప్పుడే వారికి ఇవి గుర్తొస్తాయని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అంతులేని అవినీతి జరుగుతోందని…. ఏపీ అవినీతి మంత్రులపై బిజెపి పోరాడుతుందని చెప్పారు.