ప్రజా వేదిక కూల్చి మూడేళ్లు అయింది : లోకేశ్

ఒక్క ఛాన్స్ అడిగింది ప్రతిపక్షంపై కక్ష కోసమే అని విమర్శ

lokesh

అమరావతి : టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని ఆరోపించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చి వేసి మూడేళ్లు అయిన సందర్భంగా లోకేశ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

ప్రజా వేదికను కూల్చకముందు, కూల్చిన తర్వాతి ఫొటోలను షేర్ చేశారు. ‘విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్. ప్రజావేదిక కూల్చడంతో మొదలైన విధ్వంసకాండ ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్నే దహించే స్థాయికి చేరుకుంది. ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజా సంక్షేమం కోసం కాదు, ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడం కోసమే అన్నట్టు సాగుతోంది విధ్వంస పాలన’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ప్రజా వేదికను నిర్మించారు. అయితే, వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చివేసింది. దీనిపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/