ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే దేశాలు మాకు చెప్పడమా..? జైశంకర్

India’s Reply After Pak Raises Kashmir At UN

న్యూఢిల్లీః పాకిస్థాన్‌, చైనా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎప్పటిలాగే వాటి వ్యవహారశైలి ఉందని.. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే దేశాలు మాకు చెప్పడమా..? అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారిని రక్షించడానికి అంతర్జాతీయ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఇతర దేశాలకు ప్రబోధించే అర్హత ఉందా.. అంటూ పరోక్షంగా చైనా, పాకిస్థాన్ దేశాలను ఉద్దేశించి జైశంకర్ విమర్శించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చా కార్యక్రమంలో జై.శంకర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమయంలో పాకిస్థాన్ తీరుపై జైశంర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ, సంస్కరణలపై చర్చ జరుగుతుండగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో అక్కడే ఉన్న మంత్రి జైశంకర్ పాకిస్థాన్ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ధీటైన సమాధానం ఇచ్చారు. ఆల్ ఖైదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించి, తమ పొరుగు దేశ పార్లమెంటు‌పై దాడి చేసిన వారు ఈ వేదికపై ప్రసంగించలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత కుట్రదారులు, 26/11 ఉగ్రదాడులకు పాల్పడిన వారిని రక్షిస్తూ.. వారిని శిక్షించకుండా చేస్తున్న వారికి మాట్లాడే అర్హతే లేదంటూ పేర్కొన్నారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నాయంటూ పాక్, చైనా సంబంధాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ జైశంకర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, శత్రుత్వం, హింసకు తావులేని వాతావరణంలో మాత్రమే తాము పాకిస్థాన్ తో సంబంధాలను కోరుకుంటున్నామని జైశంకర్ ఐక్యరాజ్య సమితి వేదికగా వెల్లడించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని.. ఈ వాస్తవాన్ని పాకిస్థాన్ అంగీకరించి భారత వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలంటూ హితవు పలికారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/