అక్రమ మైనింగ్ కేసు..అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ

Illegal mining case..CBI summons to Akhilesh Yadav

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు ​జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫిబ్రవరి 29న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అఖిలేష్‌ యాదవ్‌ను ఈ కేసులో సాక్షిగా సీబీఐ గురువారం ప్రశ్నించనున్నది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలైన షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్, సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012-2016 మధ్య ప్రభుత్వ అధికారులు నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ సైట్‌లను కొందరికి అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపించింది. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. 2012- 2013 జూన్‌ మధ్య మైనింగ్ శాఖ నిర్వహించిన అఖిలేష్‌ యాదవ్‌ను సాక్షిగా విచారణకు రావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది.

ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా క్రాస్ ఓటు వేసిన రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు గాను బీజేపీ 8, ఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో బిజెపి ఎనిమిదో రాజ్యసభ సీటును కూడా గెలుచుకుంది.