బీజేపీ గెలిచే 400 సీట్లలో హైదరాబాద్ ఉంటుంది: మాధవీలత ఆశాభావం

Madhavi Latha

హైదరాబాద్‌ః తాను ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని… దేశమంతా హైదరాబాద్ లోక్ సభ స్థానం వైపు చూస్తోందని బీజేపీ అభ్యర్థి మాధవీలత అన్నారు. హైదరాబాద్ స్థానంలో గెలిచి ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఇక్కడ గెలుపు ముఖ్యమన్నారు. మే 13న హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. అయినప్పటికీ తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికలు న్యాయంగా జరిగితే భారీ మెజార్టీతో గెలిచేవాళ్లమని… కానీ అన్యాయంగా జరిగాయన్నారు. హైదరాబాద్ లోక్ సభ అన్యాయం నుంచి బయటపడాలంటే తాను గెలవాలన్నారు. ఎన్నికల తర్వాత తాను హైదరాబాద్ ప్రజలకు కనిపించననే వాదనలో పస లేదని అభిప్రాయపడ్డారు. యాకుత్‌పురాలో ఇటీవల డ్రైనేజీ బయటకు వస్తుంటే మొదట వెళ్లింది తానే అన్నారు. ప్రజలు గుండెల నిండా మోదీపై ప్రేమతో ఓటు వేశారన్నారు. కేంద్రంలో ఈసారి బీజేపీ 400కు పైగా స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.