బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తే 2 శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉందిః హరిరామ జోగయ్య
టిడిపి తో పొత్తు జనసేనకు కలిసొచ్చే అవకాశం ఉందని వ్యాఖ్య
అమరావతిః ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య స్పందిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఛరిష్మాను ఉపయోగించుకుని బిజెపి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని లేఖలో ఆయన చెప్పారు. జగన్ ను ఓడించేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని అన్నారు. దీనికి కారణం ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణం కావచ్చని చెప్పారు. బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తే రెండు శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
టిడిపి పాలనలో జరిగిన కొన్ని అంశాలు జనసేనకు వ్యతిరేకంగా మారొచ్చని జోగయ్య తెలిపారు. బిజెపి మత రాజకీయాల వల్ల కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. జనసేన, బిజెపిల పొత్తు వల్ల బిజెపికే ఎక్కువ లాభమని అన్నారు. చంద్రబాబు పరిపాలన దక్షత వల్ల టిడిపితో పొత్తు జనసేనకు కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పారు.