పవన్ కల్యాణ్ చెప్పే కాకి లెక్కలను ప్రజలు విశ్వసించబోరుః మంత్రి గుడివాడ

కమెడియన్లు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు.. పవన్ ఎందుకు కాలేదని ప్రశ్న

gudivada-amarnath

అమరావతిః మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వాలంటీర్లలో 60 శాతం మంది మహిళలే ఉన్నారని, వారిపై నిందలు వేయడం విచారకరమని మంత్రి పేర్కొన్నారు. నిత్యం ప్రభుత్వాన్ని నిందించడమే పవన్ కల్యాణ్ కు పనిగా మారిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏంచేస్తామో చెప్పాలి కానీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవడమేంటని ప్రశ్నించారు. ఆయన తీరు మారకుంటే ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. పవన్ కల్యాణ్ చెప్పే కాకి లెక్కలను ప్రజలు విశ్వసించబోరని మంత్రి పేర్కొన్నారు.

సినిమాలలో కమెడియన్లుగా చేసిన వాళ్లు కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అవుతున్నారు.. పవన్ కల్యాణ్ ఎందుకు గెలవడంలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. కరోనా లాక్ డౌన్, ఆంక్షల సమయంలో వాలంటీర్లు వెలకట్టలేని సేవలందించారని మంత్రి చెప్పారు. ప్రాణాలకు తెగించి పనిచేసిన అలాంటి వారిపై నిందలు వేసినందుకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.