అమ్మవారు బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషాన్నిచ్చింది: మంత్రి తలసాని

బోనాల పండుగలో స్వర్ణలత ‘భవిష్యవాణి’పై స్పందించిన తలసాని

minister-talasani-srinivas-yadav-reacts-on-swarnalatha-rangam

హైదరాబాద్‌ః సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు ఎలాంటి ఆటంకం లేకుండా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి రెండో రోజు భక్తులు పోతెత్తారు. జాతరలో ఎంతో కీలకమైన, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసే రంగం కార్యక్రమం ఈ రోజు ముగిసింది. ఇందులో భాగంగా జోగిని స్వర్ణలత పచ్చి మట్టికుండపై నిలుచుని భవిష్యవాణి వినిపించారు. భవిష్యవాణి వినటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భవిష్యవాణి తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.

అమ్మవారు భవిష్యవాణిలో బోనాలు కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు. 2014 తరువాత రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారు. జాతర నిర్వహణకు అన్ని ప్రభుత్వంలోని అన్ని యంత్రాంగాలు సహకరించాయని తెలిపారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయన్నారు. మరికాసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోత్సవం ఘనంగా జరుగుతుందన్నారు. సాయంత్రం 7 గంటలకు ఫలహారం బండ్ల ఊరేగింపు ఉంటుందని మంత్రి తలసాని చెప్పారు.