ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్‌ ఖాళీ లేక మాజీ ఎంపీ కొడుకు మృతి

లక్నో ఆసుపత్రిలో మృతదేహంతో మాజీ ఎంపీ ధర్నా

Former BJP MP’s son dies at Lucknow hospital due to lack of bed

న్యూఢిల్లీః ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ ఖాళీ లేక పోవడంతో వైద్యం అందక ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ, బిజెపి నేత భైరాన్ మిశ్రా కొడుకు ప్రకాశ్ మిశ్రా కన్నుమూశాడు. తన కొడుకు మరణానికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ భైరాన్ మిశ్రా ఎమర్జెన్సీ వార్డు ముందే ధర్నాకు దిగారు. కొడుకు మృతదేహాన్ని పక్కన పెట్టుకుని ఆందోళన చేశారు. వైద్యుడిపై చాలామంది పేషెంట్లు, వారి బంధువులు ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు సదరు వైద్యుడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్ జీపీజీఐ) ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భైరాన్ మిశ్రా ఆరోపిస్తున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన కొడుకును శనివారం రాత్రి ఆసుపత్రికి తీసుకురాగా.. ఎమర్జెన్సీ వార్డులో బెడ్స్ ఖాళీ లేవని చెప్పారన్నారు. అక్కడున్న సిబ్బంది తన కొడుకుకు చికిత్స అందించే ప్రయత్నమేమీ చేయలేదని మండిపడ్డారు. దీంతో తన కొడుకు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యవసర విభాగంలో పనిచేస్తున్నామనే విషయం మరిచి రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని భైరాన్ మిశ్రా డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ఈ ఘటన రాష్ట్రంలోని ఆసుపత్రులలో సౌకర్యాల కొరతకు అద్దం పడుతుందని విమర్శించారు. ఆసుపత్రులలో మెరుగైన సదుపాయాల కోసం యోగి ప్రభుత్వం నిధులు కేటాయించడంలేదని అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు.