నేడు నల్గొండ జిల్లాలో మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సిఎం కెసిఆర్‌

సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోన్న బిఆర్ఎస్

CM KCR Public Meeting

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార బిఆర్ఎస్ సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. షెడ్యూల్‌లో భాగంగా మంగళవారం(నేడు) నల్లగొండ జిల్లాలో 3 కీలకమైన బహిరంగ సభలను నిర్వహించబోతోంది. హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కెసిఆర్ పాల్గొంటారు. మరోసారి బిఆర్ఎస్‌నే గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించబోతున్నారు. ఈ సభలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే మంగళవారం తెల్లవారుజాము నుంచి నల్గొండలో వర్షం పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది.

మరోవైపు కీలక మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్ కూడా ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అభ్యర్థులు సీఎం కెసిఆర్ బహిరంగ సభలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇప్పటికే వెల్లడికావడంతో సభకు సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణపై దృష్టిపెడుతున్నారు.