విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి
ముంబయిః గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు మహారాష్ట్ర లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాయ్ గఢ్ జిల్లా ఖలాపూర్ సమీపంలోని ఇర్హాల్ వాడీ గ్రామంలో గురువారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. గిరిజన గ్రామంపై కొండ చరియలు విరిగిపడటంతో సుమారు 48 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి 22 మందిని సురక్షితంగా బయటకు తీసి వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ‘ఇప్పటి వరకూ 22 మందిని రక్షించాము. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం 100 మంది పోలీసు అధికారులు, జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటోంది’ అని రాయ్ గఢ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.