లోకేశ్ యాత్రలో రద్దీ కారణంగానే నేను వచ్చేశానుః మాజీ మంత్రి నారాయణ

మహిళాశక్తి కార్యక్రమానికి 3 వేల మంది వచ్చారన్న మాజీ మంత్రి

ap-ex-minister-narayana

అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు రూరల్ లో పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ… యాత్రలో రద్దీ ఎక్కువ కావడం వల్లే తాను తిరిగి వచ్చానని చెప్పారు. మహిళలతో లోకేశ్ నిర్వహించిన మహాశక్తి కార్యక్రమానికి తాము 800 మందిని అంచనా వేస్తే… 3 వేల మంది వచ్చారని తెలిపారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ నాయకుడు అంటే తిట్టడం, తిట్టించుకోవడం కాదని… నాయకుడి లక్ష్యం అభివృద్ధే కావాలని అన్నారు. తాను కేవలం అభివృద్ధి గురించే ఆలోచిస్తానని… టిడిపి హయాంలో నెల్లూరుని ఎంత అభివృద్ధి చేశామో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. మరోవైపు ప్రస్తుతం నెల్లూరు రూరల్ లో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర ఈ సాయంత్రం నెల్లూరు సిటీలోకి ప్రవేశించబోతోంది. నగరంలోని వీఆర్సీ సెంటర్ లో భారీ బహిరంగసభలో లోకేశ్ పాల్గొననున్నారు.