కేసీఆర్‌, రెవంత్‌రెడ్డిల పట్ల అప్రమత్తంగా ఉండాలిః ఈటల

Etela Rajender

హైదరాబాద్‌ః మల్కాజిగిరి లోకసభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మరోసారి కేసీఆర్‌, రెవంత్‌రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. తాజా, మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు మాయాగాల్లెనని, అబద్దాలు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలోని నారపల్లిలో నిర్వహించిన కాలనీ ఆత్మీయ సమావేశంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే ఏదో మతోన్మాద పార్టీ అని, ఈ పార్టీ అధికారంలోకి వస్తే దేశం ముక్కలైపోతది, దేశం అల్లకల్లోలం అయిపోతదని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు కాలంలో ఎక్కడ కూడా నరమేధం జరగలేదు, రక్తపాతం జరగలేదు, కమ్యూనల్ వైలెన్స్ జరగలేదు. గోకుల్ చాట్, లుంబిని పార్క్, సాయిబాబా టెంపుల్‌ల్లాగా ఎక్కడా బాంబులు మోత లేదన్నారు. మోడీ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా బాంబుల మోతలు లేవు, తుపాకీ శబ్దాలు లేవని దేశంలో ప్రశాంతమైన వాతావరణానికి కారకుడు మోడీ యే నని అన్నారు.

పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, బల్చిస్తాన్ ప్రాంత ప్రజలు మేము కూడా భారత్‌తో కలిసి ఉంటే బాగుండనని అనుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్స్‌లో ఒకరిగా మోదీ స్థానం సంపాదించుకున్నారనీ, ప్రపంచాన్ని శాసించిన రష్యా మన జోక్యం కోరుకునే స్థాయికి ఎదిగిందన్నారు. మోదీ ప్రజల సెంటిమెంట్ రామమందిరం కట్టి జాతికి అందించారనీ తెలిపారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు కూడా న్యాయం చేశారనీ ఈటెల స్పష్టం చేశారు. ఒక్కసారి గెలిచాక రెండవసారి గెలవడమే కష్టం కానీ మోదీకి మూడవసారి కూడా ఓట్లు వేస్తామని ప్రజలే చెప్తుండడం గొప్ప విషయమన్నారు. జీఎస్టీని అమలు చేయాలని పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ భావించారు కానీ, చేయలేకపోయారు, మోడీ మాత్రం భయపడకుండా తక్షణమే అమలు చేసి రూ.73 వేల కోట్ల ఆదాయాన్ని లక్షా.80 వేల కోట్లకు పెంచారని చెప్పారు.

ఈ అభివృద్ధి, ఈ వేగం, ఈ ప్రశాంతత ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ మోడీనే ప్రధాన కావాలని దేశం కోరుకుంటుందన్నారు. ఈ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేయడంలో నా అనుభవం పూర్తిగా వాడతానని హామీ ఇస్తున్నాను. మాలాంటి వాళ్లకు ఇంకొక వ్యాపాకాలు ఉండవు. ప్రజల మధ్యలో ఉండటం, ప్రజలకు ఏమైనా అవసరం వస్తే పిలిస్తే పలికే బిడ్డగా ఉండటం తప్ప రియల్ ఎస్టేట్ కోసం కాదని అన్నారు. కాబట్టి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు మంచి చట్టాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు గర్వించే పద్ధతిలో తన బిహేవియర్ ఉండాలన్నారు. ఈ నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో నా పాత్ర ఉంటుందని మాట ఇస్తున్నాననీ ఈటెల అన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, బూత్ అధ్యక్షులు స్నేహ, నల్ల నరసింహారెడ్డి, వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ మహేష్, నరసింహ, మండల అధ్యక్షుడు ప్రవీణ్, ప్రభంజన్ గౌడ్, శివరాజ్ గౌడ్, బసవరాజు గౌడ్, రత్నాకర్, అశోక్ ముదిరాజ్, మేకల శంకర్ ముదిరాజ్, దినేష్, జితేందర్ గౌడ్, మహేష్, నరసింహ, రాజన్న తదితరులు పాల్గొన్నారు.