ఇది పూర్తిగా పార్టీపరమైన సభః సీఎం రమేశ్

అమిత్ షా సభకు పవన్ కల్యాణ్ ను పిలవకపోవడానికి కారణం ఇదే.. సీఎం రమేశ్

CM-ramesh

అమరావతిః ఈ నెల 11న విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై బిజెపి నేత సీఎం రమేశ్ మాట్లాడుతూ, 9 ఏళ్ల మోదీ పాలనలో బిజెపి సాధించిన విజయాలను అమిత్ షా వివరిస్తారని చెప్పారు. ఇది పూర్తిగా పార్టీపరమైన సభ అని… అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదని తెలిపారు. రేపు తిరుపతిలో బిజెపి బహిరంగ సభ జరుగుతోందని… తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభకు హాజరవుతారని చెప్పారు.

అమిత్ షాతో టిడిపి అధినేత చంద్రబాబు సమావేశం కావడంపై సీఎం రమేశ్ స్పందిస్తూ… అమిత్ షాతో చాలా మంది నేతలు సమావేశమవుతారని అన్నారు. వారి సమావేశం గురించి అమిత్ షా కానీ, చంద్రబాబు కానీ మాట్లాడితేనే బాగుంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బిజెపి భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే వస్తుందని అన్నారు. పొత్తులపై పార్టీ హైకమాండ్ సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.