ఎకరాకు 10వేలు పరిహారం.. రైతులకు సిఎం కెసిఆర్‌ భరోసా

దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడిన సిఎం

cm-kcr-tour-in-khammam-district

ఖమ్మంః సిఎం కెసిఆర్‌ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వడగళ్ల వాన కారణంగా పంట దెబ్బతిన్న రైతులతో సీఎం నేరుగా మాట్లాడారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపబోమని తేల్చి చెప్పారు. ఇంతకుముందు పంపిన వాటికే మోడీ సర్కారు ఎలాంటి పరిహారం పంపలేదని సీఎం అన్నారు. దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి, బాధిత రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.

ఈ పథకాలతో రైతులు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారని వివరించారు. అప్పుల ఊబిలో నుంచి బయటపడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం దండగని ఇప్పటికీ చెప్పే మూర్ఖపు ఆర్థికవేత్తలు ఉన్నారని సీఎం విమర్శించారు. అయితే, తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ మన దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,05,000 గా ఉందన్నారు. ఇందులో వ్యవసాయ రంగం పాత్ర చాలా ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. తెలంగాణను వ్యవసాయ రాష్ట్రంగా నిలబెట్టుకుంటున్నామని, రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. రైతులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.