ఏపిలో మరోసారి వైసీపీ ప్రభంజనం సృష్టించబోతుంది: ఐప్యాక్‌ ప్రతినిధులతో సిఎం

CM Jagan Meet with IPAC Team

విజయవాడ: మరోసారి ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐప్యాక్ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని… ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిశోర్ ఆలోచించలేనన్ని సీట్లు మనకు వస్తాయని చెప్పారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుందని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దామని చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీ, ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు సాగుతుందని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ కోసం ఐప్యాక్ పొలిటికల్ కన్సల్టెంట్ గా పని చేసిన సంగతి తెలిసిందే.