ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురి మృతి

పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఘోరం

bus-accident-in-vijayawada-nehru-bus-stand

విజయవాడః విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో పది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్టాండ్ లోని పన్నెండో నెంబర్ ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు గాయాలయినట్లు సమాచారం.

విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్లాల్సి ఉండగా.. ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చే క్రమంలో బ్రేకులు ఫెయిలయ్యాయి. రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు ప్లాట్ ఫాంపై ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి వెళ్లింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగి ముగ్గురు చనిపోయారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు. కాగా, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.