కేదార్‌‌నాథ్ ఆలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పూజలు

‘ఆదివాసీ’లను ‘వనవాసీ’లుగా పిలుస్తోందంటూ బిజెపి పై ఫైర్

rahul-gandhi-serves-tea-to-devotees-at-kedarnath-temple

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో భక్తులకు టీ సప్లై చేశారు. మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ఆదివారం కేదార్‌నాథ్ ఆలయాన్నిసందర్శించి పూజలు చేశారు. హారతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయం క్యూలో ఉన్న భక్తులకు రాహుల్ స్వయంగా టీ సప్లై చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

అంతకుముందు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. కులగణనపై ప్రధాని మోడీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు మరిన్ని ప్రయోజనాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులను బిజెపి ‘ఆదివాసీ’ అని కాకుండా ‘వనవాసీ’ అని పిలుస్తోందని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి బదులు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఆదివాసీ’ అనేది విప్లవాత్మకమైన పదమని, ఆదివాసీ అంటే దేశానికి మొదటి యజమాని అని అర్థమని రాహుల్ వివరించారు. అందుకనే బిజెపి ఈ పదాన్ని ఉపయోగించడం లేదని విమర్శించారు. వారు ఆ పదాన్ని ఉపయోగిస్తే కనుక అడవి, నీరు, భూమిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కాగా, చత్తీస్‌గఢ్‌, మిజోరంలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లో 25న, మధ్యప్రదేశ్‌లో 17న, తెలంగాణలో 30న పోలింగ్ జరగనుంది.