వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు.. నలుగురు దుర్మరణం

రాజస్థాన్‌లోని దౌస జిల్లాలో ప్రమాదం

4 Dead, Several Injured As Bus Falls On Railway Track In Rajasthan

జైపూర్‌: రాజస్థాన్‌లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్‌ నుంచి ఉదయ్‌పూర్‌ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్‌ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. దీంతో నలుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ దారుణం జరిగింది. అయితే ప్రమాద సమయంలో ఆ ట్రాక్‌పై ఏ రైలూ రాకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పినట్లయింది.

సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో తీవ్రంగా గాయపడిన 28 మందిలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించామని అదనపు జిల్లా కలెక్టర్ రాజ్‌కుమార్ కస్వా వెల్లడించారు.