జీవో 317 వ‌ల్ల‌ ఉద్యోగుల స్థానికతకు ప్రమాదం

సీఎం కేసీఆర్ తుగ్ల‌క్ చ‌ర్య‌ల‌కు ఇదే నిద‌ర్శ‌నం: బండి సంజ‌య్

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్ర స‌ర్కారు జారీ చేసిన జీవో 317 వ‌ల్ల‌ ఉద్యోగుల స్థానికతకు ప్రమాదం ఏర్పడిందని, కేసీఆర్‌ తుగ్లక్‌ పాలనకు ఇది నిదర్శనమని ఆయ‌న అన్నారు. జీవో 317తో ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో ఆందోళ‌న నెల‌కొంద‌ని ఆయ‌న చెప్పారు. దీంతో స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంతో వేరే జిల్లాలకు వెళ్లాల్సిన ప‌రిస్థితులు ఏర్పడ్డాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాజకీయ లబ్ధి పొందేందుకే టీఆర్ఎస్‌ కుట్ర చేస్తోంద‌ని, సీనియర్, జూనియర్ అంటూ ఉద్యోగుల్లో చీలిక తెస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పటికే ఉద్యోగులు అనేక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆయ‌న అన్నారు.

ఇప్పుడు వారిని సీఎం కేసీఆర్ చ‌ర్య‌లు మరింత ఇబ్బంది పెడుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. సమస్యల‌ను దారి మళ్లించేందుకే ఆయ‌న కొత్త సమస్యల‌ను సృష్టిస్తున్నార‌ని, త‌ద్వారా మ‌భ్య‌పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నార‌ని అన్నారు. 317 జీవోను వెంట‌నే నిలిపేయాలని బండి సంజ‌య్ డిమాండ్‌ చేశారు. ఈ విష‌యంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వానికి సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/