బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..పెను ప్రమాదం తప్పింది
బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక కోసం నిన్న హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఒంగోలు కు చేరుకున్నారు. రాత్రి ప్రీ రిలీజ్ వేడుక అనంతరం బాలయ్య ఒంగోలు లోనే బస చేసారు. ఈరోజు ఉదయం ఒంగోలు నుండి హైదరాబాద్ కు హీరోయిన్ శృతి హాసన్ , డైరెక్టర్ బి గోపాల్ తో పాటు ఆయన అదే హెలికాప్టర్ లో బయలుదేరారు.
బయలుదేరిన కాసేపటికే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హెలికాప్టర్ ను వెనక్కి మళ్లించిన పైలట్ ఒంగోలులోని హెలిపాడ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం సాంకేతిక సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక విమాన మార్గం ద్వారా నందమూరి బాలయ్య.. హైదరాబాద్ వస్తున్నారని టాక్. ఇక వీరసింహ రెడ్డి విషయానికి వస్తే..క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.