ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఆటోలు పెట్టుకోవాలంటూ డిమాండ్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్..హామీ ఇచ్చినట్లే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. పల్లె వెలుగు , ఆర్డనరీ , ఎక్స్ ప్రెస్ లలో రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణం చేసేలా జీరో టికెట్ జారీ చేసింది. దీంతో మహిళలంతా ప్రతి రోజు ఉచిత ప్రయాణం చేస్తూ రేవంత్ ఫై ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించి తమ పొట్ట గొట్టారంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని భారతీయ మజ్దూర్ సంఘ్-బీఎంఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేసారు.

. గతంలో డెబ్బై శాతం మంది మహిళలు ఆటోలు ఎక్కేవారని, దీంతో తమకు రోజుకు రూ.1000 వరకు వచ్చేవని, కానీ ఇప్పుడు రూ.300 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పథకాలతో తమ పొట్టను కొట్టారని కాబట్టి ఆటోలను ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పెట్టుకోవాలని లేదా బస్సుల సంఖ్య తగ్గించాలని అల్టిమేటం జారీ చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యను పరిష్కరించాలని లేదంటే.. 18వ తేదీన ధర్నాలు, 19న కలెక్టర్లకు వినతి పత్రం సమర్పణ, 20న డిపోల వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆ తర్వాత 21, 22 తేదీల్లో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.