నేటి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర పున:ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కొరకై మధిర నియోజకవర్గంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) శుక్రవారం నుంచి పున ప్రారంభం కానుంది. ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలోని శ్రీ వెలుగొండ స్వామి సన్నిధి నుంచి భట్టి విక్రమార్క శుక్రవారం నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు. పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) ఫిబ్రవరి 27న ఆదివారం రోజు ముదిగొండ మండలం యడవల్లి నుంచి ప్రారంభమై ఈ నెల 5న గంధసిరి గ్రామం వరకు కొనసాగింది. సుమారు 102 కిలోమీటర్ల మేర కొనసాగిన పాదయాత్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి 15 వరకు ఉండడంతో తాత్కాలికంగా వాయిదా పడిన విషయం విదితమే.

అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడటంతో తిరిగి ప్రజాసమస్యల పరిష్కారం కొరకు మధిర నియోజకవర్గం లోని చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని అన్ని గ్రామాల్లో కాలి నడక ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి భట్టి విక్రమార్క తన పాదయాత్రను శుక్రవారం నుంచి నిరవధికంగా కొనసాగించనున్నారు. ఈ పాదయాత్ర విజయవంతం చేయడానికి ఇప్పటికే  అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ పీపుల్స్ మార్చ్ నియోజకవర్గ కన్వీనర్ బుల్లెట్ బాబు   పాదయాత్ర నిర్వహించే గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేశారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/