టీడీపీ అధికారంలోకి రావడం అనేది కల – సజ్జల

చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని..టీడీపీ అధికారంలోకి రావడం అనేది కల అని అన్నారు సజ్జల రామకృష్ణ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చామని, నాడు-నేడు కింద స్కూళ్ల రూపు రేఖలు మర్చామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు.

‘‘వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా?. ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు. ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు. చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు ఏం చేశారని ప్రజల వద్దకు వెళతారని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు తాను అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటున్నారని అన్నారు. ప్రజామోదం తనకే ఉందంటున్న చంద్రబాబు 2019 ఎన్నికల్లోనూ ఇదే చెప్పారన్నారు. చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరని అన్నారు. ఏపీలో అత్యంత పారదర్శకంగా పాలన జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందన్నారు. అవినీతికి తావు లేకుండా జగన్ పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం గతంలో చేసిన అప్పుల బరువును మోస్తూ తమ ప్రభుత్వం సంక్షేమాన్ని కొనసాగించిందన్నారు.