అదే చంద్రబాబు నాయుడు బ్రాండ్ : అచ్చెన్నాయుడు

ఏపీ బ్రాండ్ ప్రపంచ దేశాలకు విస్తరించడానికి కారణం ఆ బ్రాండే

అమరావతి: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నది ‘సి’ బ్రాండేనన్న జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును, రాష్ట్రంలో ‘సి’ బ్రాండ్ ఉందని, అదే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ‘సి’ బ్రాండ్ ఉంటుందన్నారు.‘‘హైదరాబాద్ నగరం విస్తరించిందంటే బ్రాండ్ చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ కు ఒక పరిశ్రమ వచ్చిందంటే అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు చలవే. దేశం, ప్రపంచానికి ఏపీ బ్రాండ్ ను చాటిచెప్పిన ఘనత చంద్రబాబు నాయుడిది. తెలుగు జాతి ఉన్నంత వరకు, విశ్వం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉంటుంది. అది నీలాగా చీప్ లిక్కరు బ్రాండ్ కాదు’’ అన్నారు.

ఏటా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని ఒక్క మద్యం నుంచే రాబట్టేందుకు ఏపీ సీఎం జగన్ టార్గెట్ పెట్టుకున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు అన్నారు. అందుకే జాతిపిత మహాత్మా గాంధీ జయంతిరోజునే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. మద్యం దుకాణాలు, కంపెనీలన్నీ తన చేతుల్లోకి రావాలన్న ఉద్దేశంతో మద్యం పాలసీని మార్చారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న హామీనిచ్చి.. ఇప్పుడు ఆదాయం కోసం దానినే నమ్ముకోవడం దారుణం అని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/