మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య

తెలంగాణ లో ఈ మధ్య వరుసగా మెడికల్ స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలువురు పలు కారణాలతో ఆత్మహత్యలు చేసుకోగా..తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ సనత్ (21) ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ లోని తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు.

మృతుడు సనత్ ది పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని. సనత్ ఆత్మహత్యపై పోలీసులకు సమాచారం ఇచ్చారు కాలేజీ నిర్వహకులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సనత్ ఆత్మహత్యకు కారణాలు ఏంటీ.. ఎందుకు ఇలా చేశాడు అనే విషయాలపై అతని ఫ్రెండ్స్, సహచర స్టూడెంట్స్ ద్వారా వివరాలు రాబడుతున్నారు. ప్రస్తుతం ఈ ఆత్మహత్య ఫై కేసు నమోదు చేసారు పోలీసులు.

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గడిచిన మూడు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనవరి మాసంలో అదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ సంఘటన నుంచి మెడికల్ కళాశాల విద్యార్థులు తేరుకోకముందే మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న వరుస సంఘటనలు విద్యార్థులను ఆందోళన గురిచేస్తున్నాయి.